విశాఖపట్నం: వినూత్నంగా వినాయక నిమజ్జనం చేపట్టేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) శ్రీకారం చుట్టింది. బొజ్జ గణపయ్య విగ్రహాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం చేసేందుకు మొబైల్ ట్యాంకులను ప్రవేశపెట్టింది. కృత్రిమ ట్యాంకుల ట్రయల్ రన్ ముగిసిన తర్వాత వాటిని విశాఖ నగరంలోని వివిధ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచి ఇళ్లలో ప్రతిష్టించి పూజించిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడంలో సహాయపడాలని ప్రయత్నిస్తున్నారు.
గ్రేటర్ విశాఖ పరిధిలోని అన్ని మండలాలను కలుపుతూ 16 కృత్రిమ మొబైల్ నిమజ్జనం ట్యాంకులు నిలిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను పెంచనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ జీ లక్ష్మీశ చెప్పారు. తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రకం ట్యాంకులతో వినాయక నిమజ్జనం సులభమవనున్నది. ఇదే సమయంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలతో పాటు కాలుష్యం స్థాయిని క్రమబద్ధీకరించడం సాధ్యమవనున్నది.
మొబైల్ నిమజ్జనం కోసం కృత్రిమ ట్యాంక్లను సిద్ధం చేశారు. 10X16 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో భారీ వాహనాలను ఇందు కోసం తీర్చిదిద్దారు. వీటిని నీటితో నింపి ఆగస్టు 31 నుంచి వివిధ పాయింట్లలో ఉంచనున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇలాంటి పర్యావరణ అనుకూల నిమజ్జన పద్ధతులను అనుసరిస్తున్నారని, విశాఖలో ఇదే మొదటిసారి అని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీశ పేర్కొన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసి సముద్రాన్ని కలుషింతం చేయకుండా నిలువరించేందుకు ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. విశాఖపట్నం ప్రజానీకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కార్పొరేషన్ సెల్ఫీ పోటీని కూడా అందుబాటులోకి తెచ్చింది. మట్టి విగ్రహాలతో గణపతిని పూజించిన వారు సెల్ఫీ దిగి పంపి బహుమతులు గెలుచుకోవచ్చునని జీవీఎంసీ అధికారులు వెల్లడించారు.