విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్స్టర్నల్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.7,798 కోట్ల సాయం అందించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పెషల్ క్యాటగిరీ హోదాకు బదులుగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీగా ప్రత్యేక సహాయ చర్యను అమలు చేస్తున్నదని చెప్పారు. దీని కింద ఏపీలోని 17 ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్లకు రూ.7,798 కోట్ల రుణం అందజేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక చర్య ప్రకారం, 17 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్లపై రుణం అసలు, వడ్డీ రెండింటికీ కేంద్రమే నిధులు సమకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతోపాటు ప్రత్యేక సహాయ చర్యలను కేంద్రం ప్రకటించిందని తానడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారని జీవీఎల్ నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. 2015 మార్చి 15 న పార్లమెంటులో ఇచ్చిన వివిధ హామీలు, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అవసరాల నేపథ్యంలో ఏకీకృత అభిప్రాయ సేకరణ తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులలో విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్ట్ (రూ.1,859 కోట్లు), ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టమ్స్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ (రూ.935 కోట్లు), ఆంధ్రప్రదేశ్ పవర్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్ (రూ.897 కోట్లు), ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ (రూ.825 కోట్లు) ఉన్నాయి. ప్రత్యేక సహాయ చర్య కింద చేసిన ప్రాజెక్ట్లు, చెల్లింపుల యొక్క వివరణాత్మక జాబితాను కేంద్రం అందజేసిందని జీవీఎల్ తెలిపారు. నాబార్డ్ నుంచి రుణాలు తీసుకోవడం లేదా భారత ప్రభుత్వం ద్వారా రుణం తీసుకోవడం ద్వారా 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్ట్ నీటిపారుదల భాగం మిగిలిన ఖర్చులో 100 శాతం నిధులతో పోలవరం జాతీయ ప్రాజెక్ట్గా అమలు చేయడానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ ప్రత్యేక చర్యలో భాగంగా ఉన్నాయన్నారు. నరేంద్ర మోదీ ప్రకటించిన స్పెషల్ ప్యాకేజీ అమలులో లేదని ప్రస్తుత వైసీపీ, గత టీడీపీ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. పార్లమెంటులో ఇచ్చిన సమాధానంతో ఈ అబద్ధాలు బట్టబయలయ్యాయన్నారు.