అమరావతి : తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని ఎంత కోరినా కేంద్రం స్పందించలేదు. పైగా, మీ నెలకొల్పేందుకు ఎవైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటూ జగన్ సర్కార్ను అడిగింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణతోపాటు తమిళనాడు రాష్ట్రం కూడా పోటీ పడింది. చివరకు ఈ పార్క్ ఏపీలోని కాకినాడ జిల్లాలో ఏర్పాటుకానున్నది.
ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారాన్ని తెలపాల్సిందిగా కోరుతూ కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది. బల్క్ డ్రగ్ పార్క్కు సంబంధంచి డీపీఆర్ను 90 రోజుల్లోగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ను కాకినాడ జిల్లా పరిధిలోని తొండంగి మండలం కేపీపురం- కోదాడ గ్రామాల మధ్య ఏర్పాటు కానున్నది.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగం నుంచి బల్క్ డ్రగ్ పార్క్కు సంబంధించి ఏపీ చీఫ్ సెక్రటరీకి ఈ మేరకు గురువారం లేఖ అందింది. వారం రోజుల్లోగా ఈ పార్క్ ను చేపట్టేందుకు సమ్మతి తెలుపుతూ లేఖ పంపాలని కోరింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే చివరకు అది ఏపీకి దక్కింది. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా వేల సంఖ్యలో స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.