Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం వేదమంత్రోచ్చరణల మధ్య మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. అటుపై గ్రామోత్సవం నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
దివ్య కాంతులను ప్రసరింపజేస్తూ భక్తులకు వరాలిచ్చే స్వామి అమ్మవార్ల వాహనసేవను వీక్షించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు. అమ్మవారికి ప్రీతికరమైన కాగడాలు, ఎర్ర గులాబీలు, తెల్ల చామంతి, ఊదా చామంతి, మందారం, లిల్లీ, ఎర్ర గన్నేరు, ఊద గన్నేరు, దేవ గన్నేరు, నంది వర్దనం, గరుడ వర్దనం, తెల్ల చామంతి తదితర 35 రకాల ప్రత్యేక పూష్పాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు.
జామ, ఖర్జూర, నల్లద్రాక్ష వంటి తొమ్మిది రకాల పండ్లతోపాటు బిల్వం మరువం మాచీపత్రితో ప్రత్యేక అలంకరణ చేసిన శయనమందిరంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవగా శయనోత్సవాన్ని నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కళాకారులతోపాటు ఆలయ అధికారులను సిబ్బందిని అభినందించారు.