తిరుపతి : తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి(Mahashivratri ) పర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కాగా భక్తులు కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భోగితేరు ఊరేగింపు రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు.
రేపు శివపార్వతుల కల్యాణం
కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శనివారం శివపార్వతుల కల్యాణమహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని వివరించారు.
వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం
తిరుపతి : శ్రీనివాస మంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శుక్రవారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.
అంతకుముందు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వస్వామివారికి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.