అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్ నెలాఖరులోగా ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ గత కొంతకాలంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో చివరకు వారి ప్రొబేషన్ను ఖరారు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన సలహాదారు ధనుంజయరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాలలోని ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం గ్రామాల్లో 11,162 సచివాలయాలు, పట్టణాల్లో 3,842.. మొత్తం 15,004 సచివాలయాలు ఉన్నట్లు సచివాలయ ప్రత్యేక కార్యదర్శి సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 14,493 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో ఆ ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు.