Pawan Kalyan | గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు రూ. 2 వేల కోట్లు నిధులు సమకూర్చింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఇందులో బాగా దెబ్బ తిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం మూలంగా రాష్ట్రానికి సాస్కి నిధులు సమకూరాయని పవన్ కల్యాణ్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వీటిని సద్వియోగం చేసుకుందామన్నారు. సాస్కి నిధుల వినియోగించే ప్రణాళికపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో మన గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధికి తీసుకువచ్చిన నిధులు ఇవి. వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపైనా, అధికార యంత్రాంగంపైనా ఉంది. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడే విధంగా నిధులు సమకూరుస్తున్నాం. ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడవద్దు. రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా, ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే. నిర్మాణం కాంట్రాక్టు పొందినవారికీ ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియచేయండి. ఆ ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడం అవసరం. నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలి. నేను, నిపుణులు క్షేత్ర స్థాయికి వెళ్లి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదు తనిఖీ చేస్తాం. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దు.” అని పవన్ కల్యాణ్ సూచించారు.
“ప్రజలకు పటిష్టమైన రోడ్లు అందించడం అవసరం. మౌలిక వసతుల కల్పనలో రహదారులు కీలకమైనవి. సాస్కి ద్వారా వస్తున్న రూ.2వేల కోట్లతో ప్రాధాన్యత క్రమంలో రోడ్లు నిర్మించుకొనే అవకాశం వచ్చింది. ప్రత్యేకమైన ప్రాంతాల్లో, సందర్భాల్లో ఈ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడ మౌలిక వసతులు కల్పనలో భాగంగా పంచాయతీ రోడ్లు పటిష్టపరచాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు వివరించారు. ఇందుకోసం రూ.35 కోట్లను ఈ నిధుల నుంచి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కీలకమైన అభివృద్ధి పనులకు సాస్కి నిధులు ఎంతగానో తోడ్పడతాయి.” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
“ రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పూర్తి అలక్ష్యంతో వ్యవహరించింది. వివిధ మార్గాల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిని విస్మరించింది. కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు సాధిస్తోంది. ” అని పవన్ కల్యాణ్ అన్నారు.