అమరావతి : ముస్లిం మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ (YCP) సర్కార్ ముస్లిం మైనార్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతుందని బీఆర్ఎస్ (BRS) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు . తోట చంద్రశేఖర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఆలమూరు రఫీ, షేక్ నాగుల్ మీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యం.డి.ఇంతియాజ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ముస్లిం మైనార్టీల విదేశీ విద్యా బకాయిలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో విదేశీ విద్య అభ్యసించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేశారు. విదేశాలలో ఉన్న ముస్లిం మైనార్టీ విద్యార్థులకు బకాయిలు వేయకుండా ఇతర వర్గాల వారికి వేయడం వివక్షతకు నిదర్శనమని ఆరోపించారు. ఇతర వర్గాల వారికి బకాయిలు వేసినప్పుడు ముస్లిం మైనార్టీలకు వేయకపోవడానికి గల కారణం ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్య ను ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి కాలం వెళ్లబుచ్చుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య బకాయిలను విడుదల చేయకుంటే బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు.