అమరావతి : భూ బదలాంపులో అవకతవకలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల మేరకు ఏపీ ప్రభుత్వం విజయనగరం జేసీ కిషోర్కుమార్ను విధులు నుంచి రీకాల్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. కలెక్టర్ తో సంబంధం లేకుండా భూములకు సంబంధించి కొన్ని ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పై కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు.
దీంతో ఆయనను సరెండర్ చేయాలని కలెక్టర్ సూర్యకుమారికి ఆదేశాలు అందాయి. రెవెన్యూ విభాగంలో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న కిషోర్కుమార్ జిల్లాల్లో భూ బదలాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.జిల్లాలో ఐఏఎస్ అధికారిని రీకాల్ చేయడం ఇదే ప్రథమం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయన పాదాభివందనం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై పలువురు జేసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.