అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని, ఇందుకు కారణం అధికారులు, ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాధ్యులపైన అధికారులపై న్యాయ విచారణ చేపట్టాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఆదివారం లేఖ రాశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని, తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చడంతోనే తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తాయని పేర్కొన్నారు. వరద తగ్గి చాలా రోజులైనా ఇప్పటికీ బాధితులు తిండి, నీళ్లు లేక అల్లాడుతున్నారని తెలిపారు.
వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, మిగిలిన బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారమే 6 వేల 54 కోట్ల నష్టం జరిగితే… బాధిత ప్రాంతాలకు కేవలం 35 కోట్లు విడుదల చేయడం శోచనీయమని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు చేయాల్సిన 11వందల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.