అమరావతి : అమరావతి భూములు,భవనాలు అమ్మె హక్కు ప్రభుత్వానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధాని కట్టని వారికి భూములు అమ్మే హక్కు, ఉద్యోగులకు కట్టిన ఇళ్లను ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అమరావతిని శ్మశానం అని చెప్పిన ప్రభుత్వం ఈ భూములను ఎకరాకు రూ. 10 కోట్లు ఎలా అమ్ముతుందని నిలదీశారు.
అధికార వైసీపీ పాలనలో ప్రజలకు పన్నుల వాతలు, పథకాలకు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ఒంటరి మహిళల పింఛనులో ఆంక్షలు విధించడం అమానవీయమని అన్నారు. అమ్మ ఒడిలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గారని అన్నారు. ఆత్మకూరులో డబ్బు పంచినా వైసీపీకి ఓటు శాతం పెరగలేదని తెలిపారు. దుకాణాల్లో విక్రయించే మద్యం నాణ్యతపై ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
నిధుల్లేక దుల్హన్ పథకం నిలిపివేశామని కోర్టుకు చెప్పడం దారుణమని చంద్రబాబు అన్నారు. పంట నష్టపోయిన రైతులకు మొండి చేయి చూపించారని ఆరోపించారు.