అమరావతి : వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన(Governance) సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM Jagan ) స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు. మంగళవారం విజన్ వైజాగ్ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైజాగ్ నగరం హైదరాబాద్ (Hyderabad) కంటే మిన్నగా అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీకి సముద్రతీర ప్రాంతాల రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఉన్నాయని వీటిని పారిశ్రామికంగా, పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రం అన్నింటా పరుగులు పెడుతుందని అన్నారు.
అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని.. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్ తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాలా కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. ఒక్క ఎకరాలకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. తాము చేపట్టిన నూతన పారిశ్రామిక విధానాల వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని. వెల్లడించారు. కొందరు తమ స్వార్థ రాజకీయాలతో కోర్టు కేసులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు.