శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో గోపాష్టమి పర్వదిన ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. కార్తీకమాస శుద్ధ అష్టమి పర్వదిన సందర్బంగా శుక్రవారం ఆలయ ప్రాకారంలోని శ్రీగోకులంలో అర్చక వేదపండితులచే గోవు, ఆవుదూడలకు ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేల కోట్ల దేవతల స్వరూపం, ఆవాసస్థానమైన గోమాతలకు శ్రీకృష్టపరమాత్ముడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేశారు. శ్రీకృష్ణుడు తాను పెరిగిన రేపల్లెలో అధికంగా ఉండే గోవులను మేత కోసమై తొలిసారిగా అడవికి తోలుకొని వెళ్లిన రోజే కార్తీకమాస అష్టమి అయినందున ఈ రోజున గోమాతలకు ప్రత్యేక పూజులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయంలోని శ్రీగోకుంలో ప్రతినిత్యం తెల్లవారుజుమున షోడశోపచార సంకల్ప పూజలు జరుగుతున్నాయని, దీంతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సంవృద్ధిగా పండాలని వేడుకుంటున్నట్లు చెప్పారు. దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణశాలలో సుమారు 1,150 గోవులు దాతల సహయంతో సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. గోసంరక్షణకు దాతలు మరింత ముందుకు వచ్చి వస్తు రూపేణా దోహదపడాలని ఈవో లవన్న కోరారు.