తిరుమల : తిరుమలలోని ( Tirumala ) తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం నుంచి భక్తులకు అదనంగా వడ ( Vada) ప్రసాదాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( BR Naidu ) ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం ( Anna Prasadam ) మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు.
ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపును ప్రారంభించామన్నారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపును ఉపయోగించనున్నామని వెల్లడించారు.
అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోజె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.