హైదరాబాద్: భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఇకపై వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక దర్శనాలు ప్రారంభంకానున్నాయి. భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగే ఏడు కొండలకు.. కరోనా ప్రభావంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2020 మార్చి 20న శ్రీవారి దర్శనాలకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అర్జిత, నిత్య సేవల్లో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది.
కొవిడ్ ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య పెంపుపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో గత రెండేళ్లుగా దివ్యాంగులు, వయో వృద్ధులకు జారీ చేసే దర్శన విధానంలో నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తర్వాత వీరిని స్వామి వారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ముందు వరకూ తిరుమలలోని మ్యూజియం వద్ద ఉన్న కౌంటర్లో ఉదయం 10 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు 750 టోకెన్లను వయో వృద్ధులకు, దివ్యాంగులకు కేటాయించేవారు. అయితే కొవిడ్ కారణంగా ఈ టోకెన్ల జారీని నిలిపివేసింది.
ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు దర్శనం కల్పించాలంటూ భక్తులు టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా టీటీడీ అధికారులకు పెద్ద ఎత్తున లేఖలు కూడా రావడంతో దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.
రోజుకు 1000 టిక్కెట్ల చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు.
శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం పది గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వయో వృద్ధులు, దివ్యాంగులకు దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపడుతున్నది. అయితే వీరికి అందజేసే టోకెన్ల జారీ ప్రక్రియను తిరుమలలో జారీ చేస్తారా? లేక తిరుపతిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారా? లేక ఆన్లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.