తిరుమల : తిరుమలలో(Tirumala) శ్రీవారి అన్న ప్రసాద దాతలకు టీటీడీ (TTD) గుడ్న్యూస్ చెప్పింది. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించే దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని తెలిపింది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు అన్న ప్రసాద(Annaprasadam) వితరణలో పాల్గొనవచ్చని వెల్లడించింది.
విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తామని, దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చని సూచించింది. ప్రస్తుతం తిరుమల, తిరుపతిలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్మెంట్లు, బయటి క్యూలైన్లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అన్నప్రసాదం జరుగుతుందని వివరించారు.
అదేవిధంగా శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం టీటీడీ అన్న ప్రసాద విభాగం తిరుమల, తిరుపతిలలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ ( టీ, కాఫీలు, పాలు కలిపి) చేస్తుందని టీటీడీ అధికారులు వివరించారు.