తిరుపతి : తిరుమల,తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురును అందజేసింది. గతంలో కరోనా కంటే ముందు ఉన్న టైంస్లాట్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద మంగళవారం అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను పునఃప్రారంభించారు.
శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేయనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని, నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.
టోకెన్ల జారీ ప్రక్రియలో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దుకుంటూ క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచుతామని తెలిపారు. ఆధార్ నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్ పొందే అవకాశం ఉంటుందన్నారు. కరోనా తరువాత ఈ విధానాన్ని రద్దు చేసినా అధికారులు టైంస్లాట్ దర్శనం తిరిగి ప్రారంభించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.