అమరావతి : ఆలయాల్లో అవినీతి కట్టడికి ఏపీ ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. సోమవారం టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆలయాల నిర్వహణ వ్యవస్థ)ను సీఎం జగన్ మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. దేవదాయశాఖ పరిధిలోని ఆలయాలన్నింటినీ ప్రభుత్వం దీని పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ విధానంలో ఆలయాలు.. వాటిలోని పలు సేవల వివరాలతోపాటు ఈ-హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పించే అవకాశం కల్పించింది. క్యూఆర్ కోడ్ ద్వారా సైతం కానుకల సమర్పణకు వీలుంది. ఈ ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను యూబీఐ నిర్వహించనుంది.
తొలిసారి అన్నవరంలో ఆలయంలో ఆన్లైన్ పేమెంట్ (ఈ-హుండీ) విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ చెల్లింపు విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు. సేవల ప్రారంభంలో భాగంగా అన్నవరం ఆలయానికి ఈ -హుండీ ద్వారా యూబీఐ రూ. 10,116లను కానుకగా చెల్లించింది. ఆలయాల్లో అవినీతి కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఆలయాల్లో స్వచ్ఛమైన పారదర్శక వ్యవస్థలు ఉండాలని ఆయన పేర్కొన్నారు.