అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh ) ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ తెలిపింది. గ్రూప్ -1 అభ్యర్థులకు దరఖాస్తు (Applications) గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈనెల 21వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీని నోటిఫికేషన్ (Notifications) లో ప్రకటించినప్పటికీ అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈనెల 28వ తేదీవరకు దరఖాస్తు గడువును పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబర్లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 81 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్(Deputy Colletor) పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్(Tax Assistant Commissinor) 18, డీఎస్పీ (సివిల్) 26, రీజనల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ 6, కోఆపరేటివ్ సర్వీసెస్లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్,అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -2, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నామని కమిషన్ వెల్లడించింది.
మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష ఆఫ్లైన్ మోడ్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించనున్నామని ప్రభుత్వం వెల్లడించింది. డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించబోయే మెయిన్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేసింది .