తిరుమల : తిరుమల భక్తులకు టీటీడీ మరో తిపి కబురును అందజేసింది . తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం( Break Darsan) పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ‘ పే లింక్’ ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు ఇకపై కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చని వెల్లడించింది.
ఇప్పటి వరకూ సీఆర్వో లో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ ( UPI ), క్రెడిట్ కార్డు ( Credit Card ), డెబిట్ కార్డు (Debit Card) ద్వారా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సీఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుందని అధికారులు వివరించారు.