శ్రీశైలం : శ్రీశైలంలో శ్రావణమాస అష్టమి సందర్భంగా గోకులాష్టమి (Gokulashtami ) వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి( Mallikarjuna Swamy) ఆలయ ప్రాకారంలో ఉన్న శ్రీగోకులం వద్ద 11 గోవులకు, 11 లేగదూడలకు విశేష పూజాలు చేశారు. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ:సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా కురిసి పంటలు (Crops) సమృద్ధిగా పండాలని అర్చకులు మహా సంకల్పాన్ని పఠించి పూజా క్రతువులను చేశారు.
ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు మాట్లాడుతూ పురాణ ఇతిహాసాలలో గోవు (Cow) కు విశేష స్థానం ఉందని సకల దేవతల ఆవాస స్థానం గోమాత కావడం వలన ఒక్క గోమాతను పూజిస్తే దేవతలందరినీ పూజించిన ఫలితం కలుగుతుందని తెలిపారు.
కృష్ణపరమాత్ముడు రేపల్లెలో పెరిగి గోవులను కాస్తూ గోపాలునిగా పేరొంది గోవుల విశిష్టతను లోకానికి తెలియజేసిన తీరును భక్తులకు వివరించారు. దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలో సుమారు 1150 గోవులు సంరక్షింపబడుతున్నాయని తెలిపారు. గోవులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు. గో సంరక్షణకు (Protection) దాతలు మరింత ముందుకు రావాలని ఆయన కోరారు.