అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం (Dhavaleswaram) బరాజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 20.20 అడుగులకు చేరింది. సముద్రంలోకి 23 లక్షల 20 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతుండగా, పంట కాల్వలకు 10,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భారీ వరద నేపథ్యంలో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
కాగా, ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వరదలతో వందలాది లంక గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.