తిరుపతి : శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు త్వరగా, సంతృప్తికరంగా దర్శనం చేయించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, మరింత మంచి దర్శనం కల్పించేందుకు మీడియా ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి కోరారు. ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం, నిద్రాహారాలు మాని పని చేయాల్సిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. తిరుపతి శ్వేత భవనంలో టీటీడీ కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులకు నిర్వహించిన రెండు రోజుల వర్క్షాప్ మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈఓ ధర్మారెడ్డి.. 1957 నుంచి ఇవాల్టి వరకు స్వామివారి దర్శనం విధానంలో వచ్చిన మార్పులు, అంతకంతకు పెరుగుతున్న భక్తుల రద్ధీ అంశాలను సోదాహరణంగా వివరించారు.
రోజుకు 80 వేలకు మించి భక్తులకు స్వామివారి దర్శనం చేయించే అవకాశం లేదని, అయితే ఇటీవల ఈ సంఖ్య లక్ష దాటుతున్నదని ధర్మారెడ్డి చెప్పారు. కొవిడ్ సమయంలో దేశంలోని అనేక ఆలయాలు మూత పడినా, తిరుమలలో స్వామివారికి నిత్య సేవలు నిలుపలేదని తెలిపారు. కొవిడ్ అనంతరం 2021 మార్చి నుంచి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో భక్తులు దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండకుండా చేయడానికి సర్వదర్శనంకు కూడా తిరుపతిలో టోకెన్ల జారీ విధానం అమలు చేశామన్నారు. స్వల్ప సంఘటనలను చిలువలు, పలువలు చేయడంతో ఈ విధానం నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి టికెట్ల వల్ల తిరుమలలో 95 శాతం దళారులు తగ్గారని, ఇప్పటివరకు రూ.420 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. ఈ సొమ్ముతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాలు నిర్మస్తున్నామన్నారు.
జేఈఓ శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ.. సనాతన హైందవ దర్మ పరిరక్షణ, వ్యాప్తికి టీటీడీ విశేష కృషి చేస్తున్నదని చెప్పారు. టీటీడీ ఏర్పాటు, శ్రీవారి ఆలయం, సప్తగిరులు, టీటీడీ ధర్మకర్తల మండలి, ఈఓ, జేఈఓ తదితర పాలన పరమైన వ్యవస్థను పీపీటీ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు విభీషణ శర్మ శ్రీ వేంకటేశ్వర వైభవం అనే అంశంపై, యోగ శిక్షకుడు జగదేక ప్రతాప్ యోగ సాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. టీటీడీ ఆస్థాన విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, సీఈ నాగేశ్వరరావు, డీఎఫ్ఓ శ్రీనివాసులు రెడ్డి, పీఆర్ఓ డాక్టర్ రవి, ఎస్వీబీసీ సీఈఓ సురేష్ కుమార్, వీజీఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.