అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యిందని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా , కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. గుంటూరు జేకేసీ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ‘అన్న క్యాంటీన్ ’ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు తదతరులు హాజరయ్యారు.
తెలుగు ప్రజల సహకారంతో ప్రపంచ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటవుతాయని తెలిపారు. ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనేదే ఎన్టీఆర్ ఆశయ మని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గతంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు. రాజకీయ ఉద్దేశంతోనే వైసీపీ సర్కారు అన్న క్యాంటీన్లను రద్దు చేసిందని ఆరోపించారు. గడిచిన మూడేండ్ల లో వైసీపీ పాలకులు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తోందని ప్రభుత్వంపై ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.