తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల (Tirumala) లోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఫొటో ప్రదర్శనశాలలను(Photo Exhibition) టీటీడీ ఈవో జె.శ్యామలరావు(EO Shyamala Rao) , అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఇందులో భాగంగా ప్రవేశ ద్వారంలో ఉంచిన దుర్యోధన పరాభవం, అటవీశాఖ ఏర్పాటు చేసిన శేషాచల శ్రేణుల సెట్టింగ్, టీటీడీ (TTD) ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర సాంప్రదాయ శిల్పకళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు తయారుచేసిన చెక్క, సిమెంట్, లోహ శిల్పాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
నాడు-నేడు కాన్సెప్ట్తో టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్లో తిరుమల దేవాలయం, ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన అరుదైన నాటి ఫొటోల సేకరణ, ప్రస్తుతం తిరుమల అభివృద్ధి చెందిన తీరును తెలిపే చిత్రాలు ఉన్నాయి. వివిధ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఈవో, అదనపు ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో జేఈవో గౌతమి, సీవీఎస్వో శ్రీధర్, ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.