తిరుమల : కర్ణాటక సంగీత పితామహులు పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు(Aradhana mahotsavam) ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల(Tirumala) ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెల 7న తిరుమలలోని కల్యాణవేదికలో రాత్రి 7 గంటలకు యువ కళాకారులతో ‘ శ్రీ వేంకటేశ్వర నవరత్న మాలిక’ (Sri Venkateswara Navaratna Malika) గోష్టిగానం నిర్వహించనున్నమని తెలిపారు. పురందరదాసు 4.75 లక్షలకు పైగా సంకీర్తనలు రచించారని, వీటిలో ప్రధానంగా తొమ్మిది సంకీర్తనలను దాదాపు 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్టిగానం చేస్తారని వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 4 కంపార్టుమెంట్లలో వేచియున్నారని పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 64,512 మంది భక్తులు దర్శించుకోగా 23,491 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.69 కోట్లు వచ్చిందన్నారు.