Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు ఈఓ పెద్దిరాజు తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు వార పూజల్లో భాగంగా అభిషేకాలు, విశేషార్చనలు జరిపించారు.
సాయంత్రం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేసిన ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేశారు. అటుపై సేవా మహా సంకల్పాన్ని పఠించి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్త్రనామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు.
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన ప్రసాద వితరణ పథకానికి జోగుళాంబ-గద్వాల జిల్లా వాసి బీ వెంకటేశ్వరరెడ్డి రూ.లక్ష, కర్నూలు జిల్లా వాసి పల్లె పురుషోత్తంరెడ్డి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఏఈవో ఫణిదర్ప్రసాద్, పర్యవేక్షకులు మదుసూధన్రెడ్డిలకు విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. అనంతరం దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.