శ్రీశైలం : శ్రీశైల క్షేత్రానికి వచ్చే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు రాత్రి వేళ బసచేసేందుకు ప్రత్యేకంగా ఉచిత డార్మిటరీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి వచ్చే యాత్రికులలో 50శాతం మందికి సరైన వసతి సౌకర్యాలు లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఆలయ పరిసరాలలో నిదురించే సాధువులు భిక్షువులతోపాటు దుకాణాలు, ఫుట్పాత్లపై రాత్రివేళలో ఉండేవారిని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వర్షంలోనూ దర్శనాలకు బారులు..
శ్రీశైలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా యాత్రికులు స్వల్ప ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం సాయంత్రం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మల్లన్న గర్భాలయ స్పర్శదర్శనాలు శనివారం రాత్రి వరకే అందుబాటులో ఉండడంతో వీఐపీ టిక్కెట్లను తీసుకునేందుకు బారులుదీరారు. ఆది, సోమవారాల్లో సర్శదర్శనాలు పూర్తిగా నిలిపివేస్తున్న విషయాన్ని యాత్రికులు గమనించి ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో లవన్న కోరారు.