Road Accident | పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరవనం వద్ద లారీని తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోవడంతో కష్టపడి వాటిని బయటకు తీశారు. మృతులను హైదరాబాద్కు చెందిన కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు శారద, సత్యనారాయణగా గుర్తించారు.
ప్రమాద సమయంలో డ్రైవర్ సహా 13 మంది ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. తమ బంధువు ఒకరు మృతిచెందడంతో చూసేందుకు పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు, అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు.