అమరావతి: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో వైసీపీ నాయకుల మధ్య విబేధాలు రోడ్డెక్కాయి. నరసాపురం జిల్లా కేంద్రం తరలిపోవడానికి స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే కారణమంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతోనే తానే కొట్టుకోవడం సంచలనం కలిగించింది. న రసాపురం జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించిన నాయకులు అంబేద్కర్ కూడలిలో సభను నిర్వహించారు.
సభలో మాట్లాడిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎమ్మెల్యే ముదనూరి ప్రసాద్రాజు ( వైసీపీ )తీరుపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో తాను అసమర్ధుడ్ని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని, నర్సాపురంలో జిల్లా కేంద్రం సాధించటంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని, అతడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పుచేశానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఆవేదన చెందుతూ తన చెప్పుతో చెంపపై కొట్టుకోవడం విస్మయం కలిగించింది. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ప్రజలను మోసం చేశారని కొత్తపల్లి ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై పలు జిల్లాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటు, పేర్లతో పాటు ఇతరత్రా డిమాండ్ల విషయమై ఆందోళనలు సాగుతున్నాయి.