అమరావతి: రానున్న రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుత వాయుగుండం ఏపీపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం లేకపోయినప్పటికీ.. బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది.
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో సోమ, మంగళవారాల్లో మోస్తరు వానలు కురవనున్నాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం ఒడిశా, ఛత్తీస్గడ్ దిశగా కదులుతున్నందున.. దాని ప్రభావం ఏపీఐ లేకపోయినా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
వాయుగుండం ప్రభావంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు. ఈ భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంటుందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. కాగా, పశ్చిమతీరాన్ని ఆనుకొని ఉన్న మరో ద్రోణి ప్రభావంతో.. కర్ణాటక, మహారాష్ట్రలోనూ వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు.