అమరావతి : ఏపీ మంత్రి రోజాసెల్వమణి(Minister Roja) చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు (Chandra Babu) కు అభివృద్ధి గుర్తుకు వస్తుందని ఆరోపించారు. శనివారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానం కంటే నిధుల అనుసంధానంకే బాబు దృష్టి సారించారని మండిపడ్డారు.
14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎందుకు నదుల అనుసంధానం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే అప్పటి ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని వ్యాఖ్యనించారు. మహానటుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ(TDP) ని వారి కుటుంబ సభ్యులు వెనక్కి తీసుకోవాలని సూచించారు. బీజేపీ నూతన అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandeshwari ) చంద్రబాబు చేసిన వ్యాఖ్యలనే రిపీట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆమె బీజేపీ అధ్యక్షురాలా ? టీడీపీ అధ్యక్షురాలా అని నిలదీశారు.
పవన్కల్యాణ్ (Pawan Kalyan) , పురంధేశ్వరిలు చంద్రబాబును సీఎంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్యాకేజీల కోసమే పవన్ పార్టీని పెట్టారని విమర్శించారు. ప్రజల కోసం కాదని అన్నారు. ఏపీ అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా చేసిందని పార్లమెంట్లో స్వయాన కేంద్ర మంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.