గుంటూరు: పల్నాడు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అమరావతి-విజయవాడ రోడ్డుపై వరద నీరు చేరింది. దాంతో రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోడ్డుగుండా నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. రాష్ట్ర రాజధాని అమరావతి, ఆర్థిక రాజధాని విజయవాడలో నిత్యం ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. వర్షాం కారణంగా కార్యక్రమాలు నిలిచిపోయి ఇబ్బందికరంగా పరిణమించింది.
పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం పెదమద్దూరు గ్రామం వద్ద బ్రిడ్జిపై వరదనీరు పొంగిపొర్లుతున్నది. దాంతో అమరావతి-విజయవాడ మధ్య రోడ్డు కనెక్టివిటీ నిలిచిపోయింది. ముందుజాగ్రత్త చర్యగా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు పెట్టి రాకపోకలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ నగరం నుంచి అమరావతికి వెళ్లే వాహనాలను చవపాడు గ్రామం మీదుగా మళ్లించారు. ఇదే సమయంలో ద్వీప గ్రామాల వద్ద వందలాది గేదెలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న పశువులను రక్షించే మార్గం కానరాకపోవడంతో వాటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. వరదల కారణంగా ఎలాంటి మానవ, ఆస్తి నష్టం జరగలేదు. పులిచింతల ప్రాజెక్టు నుంచి వరదనీరు విడుదలవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, ప్రకాశం బ్యారేజీ 70 క్రెస్ట్ గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు శుక్రవారం ఎత్తివేసి 4.4 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో బ్యారేజీకి ఇన్ ఫ్లో పెరిగింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 4.10 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా, 4.4 లక్షల క్యూసెక్ల నీరు వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. లక్ష క్యూసెక్కుల వరదనీరు. ఇన్ఫ్లోలు మరింత పెరిగితే 4.5 లక్షల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు.