హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్లో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. టీఎస్07 జీడీ 3249 నెంబర్ గల కారు ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా.. మేదరమెట్ల సౌత్బైపాస్ సమీపంలోకి రాగానే టైరు పంక్చరై అదుపుతప్పింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ ఆ కారును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో అద్దంకి ఎస్సై భార్య వహీదా (35), కుమార్తె అయేషా (9), ఫ్యామిలీ ఫ్రెండ్స్ బుర్రాల జయశ్రీ (50), బుర్రాల దివ్యతేజ (29), డ్రైవర్ బ్రహ్మచారి (22) ఉన్నారు.