విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అర్ధ రాత్రి 2 గంటల వరకు హైడ్రామా కొనసాగగా.. ఎట్టకేలకు వారికి బెయిల్ మంజూరు అయ్యింది. గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, సావిత్రి, కిషోర్, రవికాంత్, రాజశేఖర్ ఉన్నారు.
ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భీమవరం బయల్దేరి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్కు సమీపంలో నలుపు రంగు బెలూన్లు కనిపించాయి. ఎవరూ ఊహించని ఈ ఘటనతో కలకలం రేగింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ఎవరనేది ఆరా తీసి వారిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. అయితే, పోలీసులు మాత్రం ఎలాంటి భద్రతా లోపం లేదంటున్నారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో బెలూన్లు ఎగురవేసినట్లు తెలిసిందని కృష్ణా జిల్లా ఎస్పీ పేర్కొంటున్నారు. కాగా, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని డీఎస్పీ విజయపాల్ వెల్లడించారు.
తమ హక్కులు కోసం పోరాడటం ప్రజసామ్య హక్కు అని.. దాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో విభజన బిల్లులు, ప్రత్యక హోదా గురించి మాట్లాడతారని అనుకున్నామని, అయితే అదేమీ లేకుండా నిరాశపరిచారని విమర్శించారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.