నంద్యాల : ఇద్దరు వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా ముదిరి పాకాన పడి హత్యకు దారి తీసింది. కుటుంబ కలహాలతో ఆగ్రహం చెందిన భార్య.. భర్తపై గొడ్డలితో దాడి చేసింది. కోపంలో భర్తను కిరాతకంగా చంపింది. ఈ ఘటన నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గుండంపాడు గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుండంపాడు గ్రామానికి చెందిన మెట్ల సత్యరాజు (67), సరోజమ్మ (64) దంపతులు. సత్య రాజు దేవుని సేవలో ఉండి ప్రార్థనలు చేసుకుంటూ వచ్చే ఫించన్తో జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబంలో గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తరుచూ మనస్పర్థలతో వాగ్వాదం పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి దంపతులు గొడవ పడ్డారు. భర్తపై కోపం పెంచుకున్న సరోజమ్మ.. ఇంట్లోకెళ్లి గొడ్డలి తీసుకొచ్చి భర్తపై దాడికి దిగింది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలు సరోజమ్మను స్టేషన్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని శిరివెళ్ల పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.