రాజమండ్రి: తూర్పుగోదావరి చింతూరు జలపాతంలో ఒక వ్యక్తి నీట మునిగి చనిపోయాడు. నీటిలో మునిగిపోతున్న కొడుకును రక్షించేందుకు దిగిన తండ్రి.. అదే నీటిలో మునిగి మృతిచెందాడు. అయితే, కుమారుడు మాత్రం ప్రాణాలతో బయటపడటం విశేషం. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కక్కిరాల పురుషోత్తంగా గుర్తించారు. పురుషోత్తం మృతితో అటు దమ్మపేట, ఇటు అశ్వారావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మ పేటకు చెందిన కక్కిరాల పురుషోత్తం అశ్వారావుపేటలో పెట్రోలు బంకుతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఈయనకు అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన సంతోషిణితో 18 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి 12, 10 ఏండ్ల కుమారులు దిలీప్, దీపక్ ఉన్నారు. బుధవారం తమ పెండ్లిరోజు కావడంతో కుటుంబ సమేతంగా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని జలపాతానికి విహారయాత్రకు వెళ్లారు.
జలపాతం కింద సరదాగా గడుపుతుండగా పెద్ద కొడుకు దిలీప్ నీటిలో మునిగిపోయాడు. పురుషోత్తం నీటిలోకి దిగి కుమారుడిని రక్షించాడు. ఈ క్రమంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. భర్తను కాపాడాలంటూ భార్య, కొడుకులు కేకలు వేయడంతో వచ్చిన స్థానికులు చాలా సేపు ఆయన కోసం గాలించారు. రెండు గంటల అనంతరం లోయలో పడిపోయి ఉన్న పురుషోత్తం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకున్న మోతుగూడెం ఎస్ఐ సత్తిబాబు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.