అమరావతిని రాజధానిగా చేయాలంటూ డిమాండ్ చేస్తున్న అక్కడి రైతులు.. రెండో దశ పాదయత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12 నుంచి రెండో దశ పాదయాత్రను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు రైతు జేఏసీ నేతలు చెప్తున్నారు.
అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ గుంటూరులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర వెంకటపాలెంలో ముగిసింది. గుంటూరు నుంచి తుళ్లూరు, రాయపూడి, వెంకటపాలెం మీదుగా టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు సైకిల్ యాత్ర కొనసాగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సైకిల్ యాత్ర చేసిన వారికి స్థానిక రైతులు ఘనంగా స్వాగతం పలికారు. రైతులు చేపట్టే మహాపాదయాత్రకు అండగా ఉంటామని సైకిల్ యాత్రలో పాల్గొన్నవారు భరోసా ఇచ్చారు. రాజధానిని నిర్లక్ష్యం చేయడం భావితరాలకు మంచిది కాదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాత్రలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు.
రాజధాని ఉద్యమం ప్రారంభించి ఈ నెల 12 కు వేయి రోజులు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రెండో దశ మహాపాదయాత్రకు రైతులు పూనుకునేందుకు సిద్ధపడుతున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు తీర్పు వెల్లడించి ఆరు నెలలు గడిచిపోయాయి. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం కానరాకపోవడంపై అమరావతి రైతులు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు 44 రోజుల మహాపాదయాత్ర చేపట్టారు. గత ఏడాది డిసెంబర్ 14 న తిరుపతిలో భారీ బహిరంగసభతో మహాపాదయాత్రను ముగించారు.