అమరావతి: అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహాపాదయాత్ర 32వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. గురువారం నెల్లూరులోని మరుపల్లి నుంచి ప్రారంభమైన యాత్రకు వివిధ రాజకీయ పక్షాలతోపాటు కులసంఘాలు, వృత్తిసంఘాలు మద్దతు పలికాయి. టీడీపీతో పాటు బీజేపీ, సీపీఐ నేతలు, నెల్లూరు జిల్లా గౌడ సంఘం నాయకులు, ముస్లిం మైనార్టీలు పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.
పొదలకూరు-రాపూరు మార్గమధ్యలో ఇనుకుర్తి గ్రామంవద్ద భారీవర్షాలకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయి అడుగులోతు నీళ్లు నిలవడంతో మహాపాదయాత్ర రైతులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో రోడ్లు బాగుచేయలేని ప్రభుత్వం తమపై కక్షసాధించేందుకు చూస్తోందని .. యాత్రను భగ్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.