గుంటూరు : అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కొనసాగుతున్నది. రైతుల పాదయాత్ర ఇవాళ నాలుగో రోజుకు చేరింది. గుంటూరు జిల్లాలో యాత్ర కొనసాగుతున్నది. రైతుల పాదయాత్రలో మహిళలు ఉత్సాహంగా పాదం కలిపారు. యాత్ర కొనసాగుతున్న గ్రామాల ప్రజలు, యువత మద్ధతుగా నిలిచారు. పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఇవాళ నాలుగో రోజుకు చేరింది. రాజధాని కోసం ఆందోళనలు చేపట్టి వేయి రోజులు పూర్తయిన సందర్భంగా రెండో దశ పాదయాత్రకు రైతులు పూనుకున్నారు. ఇవాళ గుంటూరులోని పెదరావూరు నుంచి వేమూరు మీదుగా కొల్లూరు వరకు పాదయాత్ర సాగింది. మూడు రాజధానులు వద్దని, ఏకైక రాజధాని ముద్దంటూ రైతులు చేసిన నినాదాలు మిన్నంటాయి. పెదరావూరు పరిసర గ్రామాల ప్రజలు ముఖ్యంగా యువత పాదయాత్రకు మద్ధతుగా నిలిచారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతినే రాజధానిగా ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. మధ్యాహ్నం భోజన విరామ సమయానికి కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల వరకు యాత్ర కొనసాగింది. పాదయాత్ర సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే, రాజధాని అమరావతి పరిరక్షణ సమితి రక్షణ కోసం బౌన్సర్లను నియమించుకున్నది. బుధవారం తెనాలి ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. వెంటనే సర్ది చెప్పడంతో రైతులు శాంతించి పాదయాత్రను కొనసాగించారు.