అమరావతి : గుంటూరు జిల్లా జొన్నల గడ్డ గ్రామానికి చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఇంటి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు అనే రైతు పెద్దపాపురం మండలం బలిసిపాడు గ్రామంలోని పొలానికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో తప్పుగా నమోదు అయ్యాయని వాటిని సరిచేయాలని గత నాలుగేండ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.
మరో వైపు పొలం అమ్మిన వ్యక్తుల నుంచి ఒత్తిడిలు రావడంతో ఆయన అధికారులకు మొరపెట్టుకున్నా పరిష్కారం కాకపోవడంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల కలెక్టరేట్కు పురుగుల మందుతో వచ్చి తన సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు విన్నవించాడు. పదిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో ఆయన ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.