అమరావతి : రైతు సమస్యలు అన్ని ఇన్నీ కావు. న్యాయం కోసం సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూ చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రత్నం నాయుడు అనే రైతు రెవెన్యూ అధికారులతో మాట్లాడుతుండగానే కుప్పకూలి కిందపడిపోయాడు. అక్కడే ఉన్న పోలీసులు, అధికారులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు.
గత మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వం రత్నం నాయుడికి లీజు కింద రెండు ఎకరాల 50 సెంట్ల భూమి ఇచ్చింది. ఇటీవల ఈ భూమిలో కొంత స్థలాన్ని గ్రామస్థులు ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకున్నారు. మిగిలిన భూమికి హక్కు పత్రాన్ని ఇవ్వాలని గత కొంతకాలంగా ఆయన తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. న్యాయం కోసం రెండు రోజులుగా కార్యాలయం వద్దే ఉంటున్నాడు.
ఇవాళ కూడా అధికారుల వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.