తిరుమల : తిరుమలలోని (Tirumala ) పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో (TTD EO) జె.శ్యామలరావు అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును(Dumping Yard) పరిశీలించారు. అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన లక్ష మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామని, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (Solid waster management) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడు, నాలుగు నెలల్లో చెత్తను మొత్తం తొలగిస్తామన్నారు. భవిష్యత్తులో వచ్చే చెత్తను శాస్త్రీయంగా డంపు చేసే విధానం అమలు చేస్తామన్నారు.
తడి చెత్త కూడా వేల టన్నులు ఉందని, ఐఓసీఎల్ బయో గ్యాస్ ప్లాంటు అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుందన్నారు. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20వేల టన్నుల కంపోస్టు తయారు చేశామన్నారు. అనంతరం పాపవినాశనం (Papanasanam) చేరుకున్న ఈవో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొను గదులు, పార్కును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆకాశగంగ మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.