అమరావతి : అమరావతిలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 9న ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో అవకాశం ఉండడంతో ఇవాళ టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మంతో కలిసి అమరావతి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామివారు విచ్చేస్తారని అన్నారు. ఇటీవల పలు రాష్ట్రాల రాజధాని నగరాల్లో నిర్మించిన ఆలయాల కంటే ఇక్కడి ఆలయం చాలా పెద్దదని, సుమారు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించామని వెల్లడించారు.
ఇక్కడ 25 ఎకరాల స్థలం ఉందని, పచ్చదనం పెంచడంతో పాటు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అర్టీసీ అధికారులతో చర్చించి చుట్టుపక్కల ఉన్న వివిధ ప్రాంతాల నుంచి భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు.