అమరావతి : ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. సబ్బవరం మండలం ఆరిపాక చిన్న యాత పాలెం సమీపంలో బాణాసంచా గోడౌన్ పేలుడు చోటుచేసుకోగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న సంఘటనా స్థలాన్ని పోలీసులు, ఫైర్ సిబ్బంది పరిశీలించారు.
ఓ ముఠా రహస్య ప్రాంతంలో బాణాసంచ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కంచరపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. మరో ఇద్దరి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉదయం వంట చేస్తుండగా.. బానాసంచ తయారీ కేంద్రంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో గాయపడ్డవారిని శంకర్రావు (48), కమలమ్మ (38), మహేశ్, ప్రసాద్గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్నారు.