అమరావతి: 2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని, క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. ఇకపై మే నెల నుంచి నెలకు 10 గ్రామ సచివాలయాలను సందర్శించి అక్కడి సమస్యలను విని పరిష్కరించేలా చూడాలన్నారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనుల బిల్లుల బకాయిలను ఏప్రిల్ నెలలోగా చెల్లించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుపై నిత్యం నివేదిక తెప్పించుకుని సమీక్షిస్తానని, ఎవరు బాగా పనిచేస్తే వారికే భవిష్యత్ ఉంటుందనేది మరువొద్దని చెప్పారు. అన్ని గ్రామాల్లో బూత్ కమిటీలను బలోపేతం చేయాలని, బూత్ కమిటీల్లో సగం మంది మహిళలనే నియమించేలా చూడాలని ఎమ్మెల్యేలను జగన్ ఆదేశించారు. జూలై 8 న పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్న విషయాన్ని ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ మరోసారి వెల్లడించారు. మంత్రి పదవి దక్కకపోతే పక్కన పెట్టినట్లుగా భావించొద్దని హితవుపలికారు. సామాజిక సమీకరణాల వల్ల కొన్ని మినహాయింపులు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉంటాయని చెప్పారు. మంత్రి పదవులు దక్కని అర్హులను గుర్తించి పార్టీ బాధ్యతల్లో, జిల్లా అధ్యక్ష పదవుల్లో నియమిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ బాగా పనిచేస్తే క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉంటాయని, మీరూ గెలవడంతోపాటు పార్టీని గెలిపించుకుని వస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయనేది మరిచిపోవద్దన్నారు. త్వరలో 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించనున్నట్లు జగన్ తెలిపారు. వైసీపీ నాయకులు వచ్చే నెల 2 నుంచి అన్ని జిల్లాల్లో గడప గడప వైఎస్సార్ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం..
మూడేండ్ల తర్వాత తొలిసారిగా వైసీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం జగన్ అధ్యక్షత వహించి ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాల్టి వైసీపీ ఎల్పీ సమావేశాన్ని పరిశీలిస్తే వచ్చే ఎన్నికలకు పార్టీ సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తున్నది. దానికి సంబంధించిన కసరత్తును అడ్వాన్సుగా జగన్ ప్రారంభించారు. ఎనిమిది నెలలపాటు గ్రామ సచివాలయాల సందర్శన చేపట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ అధినాయకత్వం సిద్ధమైంది. పనిచేయని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించేది లేదని కరాఖండితంగా చెప్పినట్లుగా జగన్ మాటలు బట్టి తెలుస్తున్నది.