అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ఇప్పటికే మూడేండ్ల సమయం వృథా అయ్యిందన్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన యనమల మీడియాతో మాట్లాడారు. అమరావతిపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని, అప్పీలుకు వెళ్లొద్దని యనమల సూచించారు.
మూడు రాజధానుల పేరుతో కాలాయాపన చేస్తూ రాష్ట్రానికి సీఎం జగన్ అన్యాయం చేశారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రభుత్వం ఏం చేసినా రాష్ట్రపతి, కేంద్రం ఆమోదం అవసరమన్నది ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. మరోవైపు మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మించాలని కోరారు.
హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది : నారా లోకేశ్
మూడు రాజధానుల వ్యవహరంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇది అమరావతి రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతుల విజయమని పేర్కొన్నారు. మూడేండ్లుగా అమరావతి రైతులు రాజధానిని కాపాడుకునేందుకు అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ అరెస్టులు, నిర్బంధాలు, దాడులకు ఎదురొడ్డి శాంతియుతంగా పోరాడి విజయం సాధించారన్నారు.
అవసరమైన అంశాలు కోర్టులు తీసుకోవు: మాజీ ఎంపీ మోదుగుల
ఇలాఉండగా, వైసీపీ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన అంశాలకు కోర్టులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కేవలం తమకు అవసరమైన అంశాలనే కోర్టులు పరిగణలోకి తీసుకుంటున్నాయంటూ వ్యాఖ్యానించారు. శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలో ఎవరు గొప్ప అనే దానిపై పూర్తిస్థాయి చర్చ జరగాలన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలని సూచించారు.