Srisailam | వైభవోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైందని దేవస్థానం ఈవో లవన్న చెప్పారు. ఈ నెల 11-21 తేదీల మధ్య జరిగే బ్రహ్మోత్సవాలకు పక్కా ప్రణాళికతో మౌలిక వసతులు కల్పించామన్నారు. దేవస్థానంలోని ప్రధాన విభాగాల అధిపతులు, ఇంజినీరింగ్ అధికారులు మౌలిక వసతుల కల్పనలో చర్యలు తీసుకున్నారని తెలిపారు. మండల దీక్షలు చేసుకున్న భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత జ్యోతిర్ముడి సమర్పణ, మాల విరమణ తర్వాత దీక్షా వస్త్రాలను దేవస్థాన పరిసరాల్లో పారవేయొద్దని శివ స్వాములను ఈవో లవన్న కోరారు.
ఈ నెల 15 వరకే జ్యోతిర్ముడి కల శివస్వాములకు నిర్ణీత సమయంలో ఉచిత స్పర్శ దర్శనం కల్పించామన్నారు ఈవో లవన్న. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలతో మూడు ప్రత్యేక క్యూలైన్లద్వార ఉభయ దేవాలయాల్లో దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే పాగాలంకరణ కార్యక్రమానికి ఆలయ ప్రాంగణంలో సుమారు 10 వేల మంది భక్తులు తిలకించేందుకు సన్నాహాలు చేశారు.
తొలిరోజు ఉదయం యాగశాల ప్రవేశం, సాయంత్రం ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని ఈవో లవన్న తెలిపారు. ప్రతి రోజూ అర్చక, వేద పండితులతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారని అన్నారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ, లింగోద్బవ అభిషేకాలు, పాగాలంకరణ, రథోత్సవ కార్యక్రమాలను ఘనంగా జరుపడానికి భక్తులు కూడా సహకరించాలని కోరారు.
దర్శనాలు, యాత్రికులు బస చేయడానికి చలువ పందిళ్లు, క్యూ కాంప్లెక్సులు, ఇరుముడి సమర్పణ, లడ్డూ ప్రసాదాలు, పాదయాత్ర భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, వైద్యసేవలు, స్నానఘాట్ల నిర్వహణ, పాతాళగంగ వద్ద భద్రత, విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ, స్వాగత తోరణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను 450 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూం ద్వారా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తామన్నారు.
శ్రీశైల మహా క్షేత్రంలో జరిగే ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వేలాది మంది శివ భక్తులు తరలి వచ్చి భక్తులకు చేస్తున్న సేవలు అభినందనీయం అని ఈవో లవన్న తెలిపారు. మంగళవారం శ్రీ భ్రమరాంబికా సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన భవనం వద్ద లక్ష విస్తరాకులను విరాళంగా అందించారు. ప్రతి యేటా చేపట్టే ఈ వితరణలో సుమారు రూ.2.5 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి నిర్వాహకురాలు ఎంవీఎస్ మహలక్ష్మి, కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు.