అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొనసాగుతున్న వారందరూ డమ్మీ మంత్రులేనని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శ్రీకాకుళంలో జరుగుతున్న సీపీఐ జిల్లా మహాసభ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక,నియంత పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు. గడిచిన మూడేండ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు విఫలమైందని ఆరోపించారు. దీంతో మంత్రులు బస్సు యాత్రను చేపట్టారని విమర్శించారు.
ఏపీ మంత్రులకు అధికారాల్లేవని, నిర్ణయాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరుగుతున్నాయని అన్నారు. సీనియర్ మంత్రులు ధర్మాన, బొత్స సత్యనారాయణతో సహా అందరూ డమ్మీ మంత్రులేనని విమర్శించారు. దేశంలో బీజేపీ కి చెందిన కొంతమంది పెద్దలు మత చిచ్చు రగల్చడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని అన్నారు. అసలు దేశానికి ప్రధాని, హోంమంత్రి ఉన్నారా ? అని ప్రశ్నించారు. మత చిచ్చుకు కారణమైన సుమీర్ శర్మ, నవీన్ జిందాల్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.