తిరుపతి : టీటీడీకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆస్తిని ఉపయోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఎస్టేట్ శాఖకు చెందిన ప్రాపర్టీ , రెవెన్యూ , కళ్యాణమండపాల విభాగాల ఏఈవోలు ,సూపరింటెండెంట్లు , కేస్ వర్కర్లతో సమీక్షా నిర్వహించారు.
ఈ సందర్బంగా సదా భార్గవి మాట్లాడుతూ టీటీడీ స్థిరాస్తులకు సంబంధించిన ముసాయిదా శ్వేత పత్రాన్ని 2020 లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు . ఇందులోని ప్రతి ఆస్తినిఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి నేతృత్వంలోని బృందాలు స్వయంగా పరిశీలించి అవి నిరుపయోగంగా ఉన్నాయా? ఆక్రమణలకు గురయ్యాయా? లీజులో ఉన్నాయా అనే పూర్తి వివరాలతో తుది నోటిఫికేషన్ ప్రకటించడానికి నివేదిక సిద్ధం చేయాలన్నారు.
ఇందుకోసం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు వేగంగా తమ పని పూర్తి చేయాలని ఆదేశించారు. లీజుకు ఇచ్చిన కల్యాణ మండపాల నిర్వహణపై టాస్క్ ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలని ఆదేశించారు.